ప్రకటించిన ఇన్‌చార్జిలు ఫైనల్ కాదు.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
ప్రకటించిన ఇన్‌చార్జిలు ఫైనల్ కాదు.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అధికార వైసీపీ విడుదల చేసిన జాబితాల్లో ఉన్న అభ్యర్ధులపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు. జాబితాలో పేరు రావడంతో తామే అభ్యర్ధులుగా చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్న నేతలకు వైవీ సుబ్బారెడ్డి మాటలతో గట్టి షాక్ తగిలినట్లు అయ్యింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా విడుదల చేసిన సీట్ల జాబితాపై ఆయన మీడియా మాట్లాడుతూ.. వైసీపీలో ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రస్తుతానికి పార్టీ సమన్వయకర్తలు మాత్రమేనని, వారిదే ఫైనల్ అని అనుకోవద్దని అన్నారు.

అంతేగాక తుది జాబితాలో పేర్లు ఉన్నవాళ్లే అభ్యర్ధులు అని తేల్చేశారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత మేనిఫెస్టోతో పాటే తుది జాబితా విడుదల చేస్తామని, అప్పటివరకు పార్టీ కోసం నియోజకవర్గాల్లో పని చేసే సమన్వయకర్తలు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైసీపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీపై ఉన్న వ్యతిరేఖత కారణంగా నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరిగి బలం పెంచుకోవాలని అభ్యర్ధులకు హెచ్చరిస్తున్నారా..? లేక టికెట్లు దక్కక పక్క చూపులు చూస్తున్న నేతలకు చివరి వరకు అవకాశం ఉందని హింట్ ఇస్తున్నారా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు తామే ఫైనల్ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలతో అయోమయంలో పడ్డారు. టికెట్లు ఖరారు అయ్యాయని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ.. గెలుపు కొరకు ఇప్పటినుంచే డబ్బు ఖర్చు పెడుతూ, తీవ్రంగా శ్రమిస్తున్న ఇన్ చార్జిలకు ఆఖరి నిమిషంలో సీటు లేదంటే మా పరిస్థితి ఏం కావాలని వాపొతున్నారు. ఇప్పటికే మార్పులు చేర్పులతో పార్టీలో గందరగోళం నెలకొన్న ఈ పరిస్థితుల్లో వైవీ సుబ్బారెడ్డి ఈ తరహ వ్యాఖ్యలు చేయడం పట్ల.. ఎన్నికల్లో పార్టీ వ్యూహాలేంటో అర్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



Next Story

Most Viewed